దేవదత్తుని వృత్తాంతం – ఐదవ భాగం (తరువాయి భాగం)
శ్రీ మల్లాది గోవింద దీక్షితులు గారి తపన (continued)
అక్కడే ఉన్న ఒక వైద్యుడు దీక్షితులు గారి అభిమాని. హాస్పిటల్ లోనికి ఆయన్ని తీసుకుని వెళ్ళారు. దురదృష్టవశాత్తు మల్లాది గోవింద దీక్షితులు గారికి కనీసం ఆ హాస్పిటల్ లో ఒక మంచమైనా దొరకలేదు. అందుకని ఆయన్ని క్రిందనే పడుకోబెట్టారు. అదే ఊళ్ళో ఆ డాక్టర్ గారు ఉంటారు కాబట్టి ఆయన గురువుగారికి సకల సపరిచర్యలు చేయడం, ప్రొద్దున్నే ఆయనకి కావలసిన అల్పాహారం ఇవ్వడం, మరి అప్పటికే ఆయన కాలు చాలా భయంకరంగా వాచి పోయి ప్రమాదకరమైన పరిస్థితిలో ఉండడం, ఖరీదైన మందులు ఆయనకి ఇవ్వడం, ఇదంతా నాగనాథుడు గమనిస్తూనే ఉన్నాడు
ఋణానుబంధం
నాగనాథుడు కొద్దిగా భూతకాలంలోనికి వెళ్ళడం, అక్కడ గుజరాత్ నుండి రాజకుమారి అనే ఆవిడ, భాగ్యనగరం నుండి ప్రసిద్ధులైనటువంటి ఒక హోమియోపతి వైద్యుడు, మరియొక యువకుడు ఆ దత్తుని సంస్థలో కలవడం, ఎన్నో విషయాలు శ్రీ మల్లాది గోవింద దీక్షితులు గారు వారితో చర్చించడం, వాళ్లకి శ్రీ గోవింద దీక్షితులు గారితో అనుబంధం కలవడం, ఆ సందర్భంలో శ్రీ గోవింద దీక్షితులు గారు రాజకుమారి తో తన గురువు గారి దగ్గర్నుంచి తీసుకుని వచ్చిన అసలైన శ్రీ పాద శ్రీ వల్లభ చరితామృతం ఇచ్చి దాన్ని హిందీ భాషలోనికి అనువదించమని సూచించడం, వీడ్కోలు సమయంలో ఒక ఔదుంబర మొక్కని కూడా వారికి ప్రసాదించడం, ఎంతో అభిమానంతో వారిద్దరినీ సాగనంపడం, ఇవన్నీ నాగనాథుడు చూస్తూనే ఉన్నాడు. రాజకుమారిగారి అంతఃకరణ ఎంతో పరిశుద్ధంగా ఉండడం, ఇన్నేళ్ళ నుంచి హిందీ భాషలోనికి అనువాదం చేస్తామని చెప్పినవారు ఆ పనినే చేయకపోవడం, దాన్ని ఎంతో సమర్థవంతంగా రెండు నెలలోనే రాజకుమారిగారు హింది భాష లోనికి అనువాదం చేయడం, ఆ రోజు శ్రీ గోవింద దీక్షితులు గారు ఎంతో సంతోషపడడం నాగనాథుని కంటికి కనిపించింది. అంతే కాక వారు దాన్ని హరబాబా గారికి పంపించడం, ఆయన త్వరలోనే దాన్ని పుస్తకరూపంలో ముద్రిస్తామని చెప్పడం, అయన మనోగతానికి అర్థమైంది. శ్రీ గోవింద దీక్షితులు గారి పరిస్థితి తెలిసిన ఆ రాజ కుమారి గారు వెంటనే ఆయనకి దాదాపు లక్ష రూపాయల దాకా ఆయన బ్యాంకు లో డిపాజిట్ చేయడం, అంతా చూసిన నాగనాథుడు ‘ఆహా ! ఇంకా ఈలోకం లో మంచివాళ్ళు ఉన్నారు కదా !” అని అనుకున్నాడు. మంచి హృదయం, శ్రీపాద శ్రీ వల్లభుల వారి పట్ల ఎంతో గౌరవం ఉన్న వాళ్ళు ఆయన కంటికి కనిపించినందు వల్ల ఆయన చాలా సంతోషపడ్డారు.
ఇక్కడ శ్రీ మల్లాది గోవింద దీక్షితులుగారికి వైద్యం చేస్తున్నటువంటి వైద్యుడు ఆయనలో ఏమాత్రం మార్పు కనిపించక పోవడంతో కాస్త భయపడ్డాడు. అప్పుడు శ్రీ దీక్షితులు గారు నాకు భాగ్యనగరంలో ఉన్న డాక్టర్ శాంతిస్వరూప్ గారి మందులే కావాలి అని చెప్పడం, ఆ డాక్టర్ గారు అక్కడ్నుంచే ఆ రిపోర్ట్ లన్నీ చెప్పడం, డాక్టర్ శాంతిస్వరూప్ గారు భాగ్యనగరం నుండే మందులు చెప్పడం, ఆ మందులు ఆయన వాడడం, సరిగ్గా రెండు వారాలలోనే శ్రీ దీక్షితులుగారి కాలు నయమైపోయి, స్వస్థత చేకూరడం నాగనాథుడు గమనించాడు. ఒకవైపు అదే ఊళ్ళో ఉంటున్న దత్త సంస్థ కాని, శ్రీపాద శ్రీవల్లభ సంస్థ కాని ఏమీ పట్టించుకోక పోవడం, ఎక్కడ్నుంచో ముక్కు-ముఖం తెలియని వాళ్ళు వచ్చి శ్రీ దీక్షితులుగారితో అనుబంధం పెంచుకోవడం, సమయానికి వారు ఆయనకి ఆర్ధిక సహాయం చేయడం చూసిన నాగనాథుడు “ఆహా ! ఏమీ ఈ తేడా ! ఏమి ఈ విచిత్రం !” అని అనుకున్నాడు. వారిద్దరిని కూడా ఆయన ఎన్నోరకాలుగా ఆశీర్వదించాడు.
అటు దత్తుని సంస్థ వారు, ఇటు శ్రీపాద శ్రీవల్లభ సంస్థ వారు శ్రీ గోవింద దీక్షితులు గారిని కేవలం పిచ్చివాడి మాదిరిగానే చూడడం, అలాగే ఆయన వెనుక ఆయన గురించి మాట్లాడడం చూసి నాగనాథుని మనస్సుకి కొంచెం ఆవేదన కలిగింది. “అయ్యో ! వీళ్ళు ఎంత పాపకర్మలని పెంచుకుంటున్నారు ! ఇది వీరి అమాయకత్వమా లేక అహంకారమా?” అని ఆయన మీమాంసలో పడ్డారు.