దేవదత్తుని వృత్తాంతం - 9
వల్లభ దాసు యొక్క కీర్తి,
పరమ భక్తుడు అయినటువంటి వల్లభ దాసు, దత్తాత్రేయుని యొక్క తత్వాన్ని బాగా అర్థం చేసుకున్నాడు. అందుకనే కేవలం శ్రీ దత్తాత్రేయుల వారే అవధూత రెండవ వారు లేరు అని పూర్తిగా ఆకళింపు చేసుకున్నారు. అయితే సమాజం లో ఎంతో కొంత సాధన చేసిన తర్వాత చిన్న చిన్న మహిమలు చేసే సన్యాసులు యోగులు తమని తాము అవధూతలుగా ప్రకటించుకునే వారు రోజు రోజు ఎక్కువ కావడం, ప్రజాలుకుడా దత్తాత్రేయుని లక్ష్యంగా పెట్టుకు న్నప్పటికి ఆదారిలో వెడుతూ మధ్యలో ఇటువంటి చిన్న చిన్న మాయలు చేసే గోసాయిల మాయలో పడుతూ భ్రష్టులవుతున్నారే అనే తపన వల్లభ దాసు మనసులో ఉండేది. అమాయకులయిన ప్రజల ధనాన్ని మానాన్ని కూడా ఇటువంటి కపట అవధూతలు, కపట సన్యాసులు హరిస్తున్నారే అనే ఆక్రోశం యెంతో అతనికి వుండేది.
అందువల్ల వల్లభదాసు చుట్టు ప్రక్కల ఎవరైనా అలాంటి కపట అవధూతలు, సన్యాసులు, సాధువులు వచ్చి ప్రజల్ని మోసం చేస్తుంటే అతని అనుచరులు అతనితో చెప్పడంతో వల్లభదాసు అనుచరులతో వెళ్లి దత్తాత్రేయునిపై భారం వేసి వారి భరతం పట్టేవారు.దీని వల్ల చిల్లర స్వాముల వెంట వెళ్లడం వారిని గురించి లేనిపోని మహిమలు ఆపాదించి ప్రచారం చేయడం లాంటివి చేసే దత్తాత్రేయుని తత్వాన్ని సరిగా అర్థం చేసుకోలేని పండితులకు వల్లభదాసు అంటే కన్నెర్రగా ఉండేది. కానీ వల్లభదాసుకి ముఖ్యంగా పామరులు, కర్షకులు ఎంతోమంది అనుచరులుగా అండగా ఉండటం వల్ల అతన్ని వాళ్ళు ఏమి చేయలేక పోయారు.
ఇలాగే ఒకసారి ఒక అతడు తనను తాను అవధూతగా ప్రకటించడం వల్ల చాలా మంది జనులు అతని దగ్గరకు వెళ్లడం జరిగింది. ఆ కపట అవధూత శిష్యులు ఆ అవధూతకు దక్షణగా వచ్చిన ధనాన్ని ఆశించి, దానికి గాను లేనిపోని మహిమలు కపట అవధూతకు ఆపాదించి ప్రచారం చేసేవారు. ఐతే అవధూత తత్వాన్ని పింగలనాగుడికి ఏవిధంగా అయితే స్వామి దత్తపురణం లో చెప్పారో అది అణువణువునా జీర్ణించుకునివున్న వల్లభదాసుకి ఇటువంటి అవధూతలను చూస్తే చాలా కోపంగా ఉండేది. అయితే వల్లభదాసుకు అక్కడ దత్తస్వామి ఒక చేత్తో సూర్యుణ్ణి ముట్టుకున్నారు, మరో చేత్తో అశుద్ధం పట్టుకున్నారు అన్న విషయం బుర్రలో బాగా నాటుకుంది. అందుకని ఒకసారి వల్లభదాసు తనను అవధూతగా చెప్పుకుంటున్న ఒక అతని దగ్గరకు వెళ్లడం జరిగింది. అక్కడ జరిగినవి తరువాయి భాగం వచ్చే అధ్యాయంలో చెప్పుకుందాం.